భార్య, పిల్లల మీద మర్డర్ ఎటాక్…రిటర్న్ లో తగలబెట్టిన భార్యా పిల్లలు

కోమరం భీమ్ జిల్లాలో దారుణం జరిగింది. తన భర్తను అతిదారుణంగా ఆటోకి కట్టి, కాల్చి చంపిందో భార్య. తల్లి చర్యకు వారి కొడుకు, కూతురు సాయం చేయడం విశేషం. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన కోమరం భీం జిల్లాలో జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం జైనూర్ మండలం రాంజీగూడ గ్రామానికి చెందిన 52 ఏళ్ల నారాయణ ఓ ప్రభుత్వ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నాళ్లుగా కుటుంబకలహాలతో నారాయణకీ, అతని భార్య యమునాబాయి, కొడుకు రాజ్‌కుమార్, కూతురు ఆదిలక్ష్మీలకు గొడవలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 25న అర్ధరాత్రి కూడా ఏదో విషయమై భార్యాపిల్లలతో గొడవ పడిన నారాయణ వారిని ఇంట్లో పెట్టి నిప్పుపెట్టాడు. అయితే సమయానికి ప్రమాదాన్ని గుర్తించిన అతని భార్య, కొడుకు,కూతురు బయటికి వచ్చి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తమను చంపేందుకు చూసిన తండ్రిపై పగ పెంచుకున్న వారు అతని కోసం గాలించారు. అయితే అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు నారాయణ. ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ ఏరియాలో బంధువు ఇంట్లో నారాయణ ఉన్నాడనే విషయం తెలుసుకున్న, అతని కుటుంబసభ్యులు.. అక్కడికి చేరుకున్నారు. నారాయణను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని, గాదిగూడ ఏరియాలోని ఖడ్కీ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అడవిలోకి తీసుకెళ్లిన తర్వాత నారాయణ కాళ్లు, చేతులు కట్టేసి ఆటోలో పడేశారు. పెట్రోల్ పోసి ఆటోతో సహా నిప్పు పెట్టి చంపేశారు. భర్తను చంపిన తర్వాత యమునాబాయి, కొడుకు, కూతురుతో కలిసి జైనూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హత్య చేసినట్టు ఒప్పుకుని, పోలీసులకు లొంగిపోయారు.