పెళ్లింట విషాదం

పెళ్లింట విషాదం

జిల్లా కేంద్రానికి సమీపంలోని చాకలిపేటలో పెళ్లింట విషాదం అలముకుంది. భారీ వర్షంతో పాటు పిడుగుపడి ఇద్దరు వ్యక్తు లు మృతిచెందగా ముగ్గురు గాయపడ్డారు. విజయనగరం రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చాకలిపేటలో శుక్రవారం జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఐదుగురు వ్యక్తులు సాయంత్రం రామనారాయణం వద్ద ఉన్న మామిడి తోటలో చెట్ల కింద కూర్చొన్నారు. అనుకోకుండా కురిసిన వర్షానికి తోటలోనే ఉండిపోయారు.

అదే సమయంలో పిడుగులు పడడంతో ఒక పక్క కూర్చొన్న చాకలిపేటకు చెందిన పి.ఎర్నిబాబు (28), సురేష్‌ (26)లు అక్కడికక్కడే చనిపోయారు. మరో వైపు కూర్చొన్న సారిక శ్రీను, వెంకటేష్‌, కళింగపట్నం పెంటయ్యలు గాయపడ్డారు. ముగ్గురూ కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.