మనుషులేనా అసలు…తొమ్మిదో తరగతి బాలిక మీద 18 మంది రేప్ !

Bihar Teen Raped For Months Allegedly By 18 Including Principal, Teachers

దేశంలో రోజురోజుకీ మహిళల మీద అఘాయిత్యాలు పెచ్చు మీరుతున్నాయి. ఎంతలా దేశంలో పరిస్థితి దిగజారిందంటే ఇది వరకు అడపా దడపా క్రైం న్యూస్ లో కనిపించే ఈ ఘటనలు ఇప్పుడు ప్రతి రోజూ కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ తలదన్నేలా ఇప్పుడు బీహార్ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీహార్‌లో ఏడు నెలలుగా జరుగుతున్న అత్యంత దారుణ విషయం ఒకటి బయటపడింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు కామంతో కళ్లు మూసుకుపోయి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపాల్‌ సహా 18 మంది అత్యాచారం చేశారు. అత్యంత భయానకమైన ఈ విషయాన్ని బాధిత బాలిక శుక్రవారం బయటపెట్టింది.

గడిచిన ఏడునెలలుగా జరుగుతున్న ఈ దారుణాన్ని భరిస్తూ వచ్చింది ఆ బాలిక. బిహార్‌లోని ఛప్రా జిల్లా పర్సాఘడ్‌లోని ఓ స్కూల్‌లో బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఓ కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరైన ఓ క్లాస్‌మేట్‌ ఓదార్చినట్లు నటించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌ మరో ఇద్దరు టీచర్లకి కంప్లైంట్ చేయబోగా వారు, వారు అఘాయిత్యం చేసిన సంగతి తెలుసుకున్న మరో ఐదుగురు విద్యార్థులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

వారికి జత కలిసిన మరికొందరు విద్యార్థులు అప్పటి నుంచి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ఏడు నెలలుగా మృగవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యే తండ్రి జైలు నుంచి విడుదల కావటంతో జరిగిన దారుణాన్ని అతనికి చెప్పుకుని కూతురు విలపించింది. దీంతో ఎక్మా పోలీస్‌ స్టేషన్‌లో తండ్రిసాయంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రిన్సిపాల్‌తోపాటు ఓ టీచర్‌ను, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం తరలించిన అధికారులు.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు.