కోహ్లీని ఔట్ చేయడం ఇదే తొలిసారి

కోహ్లీని ఔట్ చేయడం ఇదే తొలిసారి

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. వికెట్ల వెనుక నుంచి అప్పటికప్పుడు వ్యూహాల్ని రచిస్తుంటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకోవడంతో.. విరాట్ కోహ్లీ వికెట్ సాధ్యపడిందట. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్‌కి దేవదత్ పడిక్కల్ , విరాట్ కోహ్లీ .. మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కి 13.2 ఓవర్లలోనే 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీని.. 14వ ఓవర్‌లో కోహ్లీని ఔట్ చేయడం ద్వారా డ్వేన్ బ్రావో విడదీశాడు.

వాస్తవానికి ఆ 14వ ఓవర్‌ని మొయిన్ అలీతో వేయించాలని తొలుత ధోనీ భావించాడట. కానీ.. పిచ్ స్లోగా మారడంతో.. ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని స్లో డెలివరీలను సమర్థంగా విసరగల డ్వేన్ బ్రావో చేతికి బంతిని ఇచ్చినట్లు మ్యాచ్ తర్వాత ధోనీ వెల్లడించాడు. ఫుల్ లెంగ్త్ రూపంలో బ్రావో విసిరిన బంతిని మిడ్ వికెట్ దిశగా విరాట్ కోహ్లీ హిట్ చేయగా.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. దాంతో.. బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్ రవీంద్ర జడేజా చేతుల్లో పడింది. ఐపీఎల్‌లో కోహ్లీని బ్రావో ఔట్ చేయడం ఇదే తొలిసారి.

‘‘బెంగళూరు టీమ్‌కి మెరుగైన ఆరంభం లభించింది. కానీ.. 8-9 ఓవర్ల తర్వాత పిచ్‌ స్లోగా మారుతూ కనిపించింది. దాంతో.. జడేజాతో పాటు మొయిన్ అలీతో బౌలింగ్ చేయించాలనుకున్నా. ఈ మేరకు మొయిన్ అలీతో కూడా డ్రింక్స్ బ్రేక్‌లో ఆ మాట చెప్పాను. కానీ.. ఆ తర్వాత నేను మనసు మార్చుకుని డ్వేన్ బ్రావోతో బౌలింగ్ చేయించాలని నిర్ణయించుకున్నా. బ్రావోని బ్రదర్ అని నేను పిలుస్తాను. ఓవర్‌లోని ఆరు బంతుల్నీవైవిధ్యంగా వేయాలని సూచించా. ఇక అతను స్లో డెలివరీలను విసరగలడని అందరికీ తెలిసిందే’’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.