విష జ్వరం బారిన పడి యువతి మృతి

విష జ్వరం బారిన పడి యువతి మృతి

భవిష్యత్‌తో ఆ యువతి ఎన్నో కలలు కన్నది. వివాహం నిశ్చయమైన నేపథ్యంలో పెద్దలు త్వరలోనే ముహూర్తం నిర్ణయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతలోనే మాయదారి విషజ్వరం ఆమెను కబళించింది. వివరాలిలా… కల్లూరు గ్రామపంచాయతీ పరిధి రామానగర్‌ కాలనీకి చెందిన కుంచాల వీరయ్య కుమార్తె వెంకటేశ్వరమ్మ (20)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది.

ఈ మేరకు త్వరలోనే ఇరువైపులా పెద్దలు కూర్చుని ముహూర్తం నిర్ణయించాలని భావిస్తున్నారు. ఇంతలోనే వెంకటేశ్వరమ్మ విష జ్వరంబారిన పడగా, కల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా ఆమె సోమవారం మృతి చెందింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. కాగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు పలువురు పరామర్శించారు.