Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహారాష్ట్రలో తాజా ఉద్రికత్తలకు కారణమైన భీమా కొరేగావ్ ఉదంతానికి 200 ఏళ్ల నేపథ్యం ఉంది. పూణె నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం కొరేగావ్. అక్కడ మరాఠా పాలకుడు బాజీరావ్ పీష్వా-2 సైన్యాన్ని బ్రిటిష్ సైన్యంతో కలిసి దళితులైన మహర్లు తరిమికొట్టారు. అప్పట్లో మహర్లను అంటరానివారిగా చూసేవారు. వారిని సైన్యంలో చేర్చుకునేందుకు పీష్వా నిరాకరించగా…బ్రిటిషర్లు మాత్రం అవకాశం కల్పించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న మహర్లు పీష్వాపై ఆగ్రహంతో బ్రిటిష్ సైన్యంతో కలిసి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన దళితుల స్మారకార్థం భీమా కొరేగావ్ లో 1851లో స్మృతి చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. 49 మంది మహర్ దళిత సైనికుల పేర్లను ఆ రాతి చిహ్నంపై రాశారు. బీమా కొరేగావ్ యుద్ధం జరిగి 109ఏళ్లయిన సందర్భంగా 1927 జనవరి 1వ తేదీన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కొరేగావ్ యుద్ధాన్ని కులతత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరుగా అభివర్ణించారు. అప్పటినుంచి ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ప్రతీఏటా ఈ స్థూపం వద్ద ప్రశాంతంగా సంస్మరణ కార్యక్రమం జరుగుతోంది.
అయితే ఈ ఏడాది ఉద్రిక్తతలు ఏర్పడడానికి కారణం కొన్ని హిందూ సంస్థలు సంస్మరణ కార్యక్రమాన్ని వ్యతిరేకించడమే. అఖిల భారత బ్రాహ్మణ మహాసభ,హిందూ అగాదీ, రాష్ట్రీయ ఏక్తామాతా లాంటి గ్రూపులు సంస్మరణ కార్యక్రమం జాతి వ్యతిరేకతతో కూడుకున్నదని వాదిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతలకు వారం రోజుల క్రితమే బీజాలు పడినట్టు తెలుస్తోంది. హిందూ అనుకూల ఔత్సాహిక చరిత్రకారులు కొందరు ఫేస్ బుక్ పేజీలో నడుపుతున్న ఇతిహాస ఫాల్ఖుదా అనే మరాఠా పేజీ ఉద్రికత్తలను పెంచిదని భావిస్తున్నారు. భీమా కొరేగావ్ యుద్దం కేవలం పెషావర్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్దమేనని, మహర్లకు ఎలాంటి సంబంధం లేదని వారు వాదిస్తున్నారు. ఈ వాదనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న దళిత యువత పెద్ద ఎత్తున సంస్మరణ కార్యక్రమానికి తరలివచ్చినట్టు సమాచారం.