12 ఏళ్ల తరువాత నెరవేరిన చిరు కల

12 ఏళ్ల తరువాత నెరవేరిన చిరు కల

మెగాస్టార్‌ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ సైరా నరసింహారెడ్డి సూపర్‌ హిట్ కావటంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవదుల్లేవు. చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా, చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు చిరు కూతురు సుష్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. మరో సమీప బంధువు విద్య కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సీఈవో బాధ్యతలు చూసుకున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ అంతా తామే అయి తెరకెక్కించిన సినిమా సూపర్‌ హిట్ కావటంతో పార్టీలతో బిజీ అయ్యారు ఫ్యామిలీ మెంబర్స్‌.

తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, నిర్మాత అల్లు అరవింద్‌లు సైరా టీంకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌, అల్లు శిరీష్‌లతో పాటు అక్కినేని వారసుడు అఖిల్ పాల్గొన్నారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన హీరో శ్రీకాంత్‌, దర్శకులు హరీష్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి, నిర్మాత బన్నీవాసుతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిరు 12 ఏళ్లుగా ఎదురుచూసి చేసిన సైరా నరసింహారెడ్డి గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో కలెక్షన్ల పరంగా కూడా సైరా సంచలనాలు నమోదు చేస్తోంది. తొలి వారాంతానికే ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరుతుందని భావిస్తున్నారు.