కేసీఆర్ గుర్తులు చెక్కింది అందుకే !

కేసీఆర్ గుర్తులు చెక్కింది అందుకే !
యాదాద్రి ఆలయ అష్టభుజి ప్రాకారంపై కేసీఆర్, టీఆర్ఎస్ గుర్తులను చెక్కించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతుంది. దీంతో.. టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వివరణ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులను భవిష్యత్ తరాలకు తెలియజేయడానికే.. శిల్పాలు చెక్కామని, ఆ బొమ్మల్లో తప్పేం లేదని స్పష్టంచేసింది. ఒకవేళ అవి తీవ్ర అభ్యంతరం అని ఎవరైనా వస్తే.. వాటిని తొలగించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు వైటీడీఏ కిషన్ రావు. యాదాద్రి ఆలయంలో కేసీఆర్, కారు శిల్పాలు చెక్కడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో యాదాద్రి ఆలయ ప్రత్యేక అధికారి కిషన్ రావు స్పందించారు. భావితరాలకు చరిత్ర తెలియాలనే ఉద్దేశంతోనే శిల్పి తన వ్యక్తిగత ఆసక్తితో కేసీఆర్ బొమ్మ చెక్కారని యాడా ప్రత్యేక అధికారి కిషన్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ చెబితేనో, మరో అధికారి చెబితేనో కేసీఆర్ శిల్పాలు చెక్కలేదన్నారాయన.  కారు అనేది ఈ కాలంలో వాడుతున్న వాహనాలు భవిష్యత్ తరాలకు తెలియాలనే చెక్కామన్నారు యాడా అధికారి కిషన్ రావు. కారు టీఆర్ఎస్ పార్టీ గుర్తుగా చూడాల్సిన అవసరం లేదన్నారాయన. కేసీఆర్ కిట్ సామాజిక సంస్కరణ అని, అందుకే అందరికీ తెలియాలనే ఆ శిల్పం చెక్కామన్నారు యాడా ప్రత్యేక అధికారి కిషన్ రావు. లక్షల మందికి ఉపయోగపడుతోందనే ఉద్దేశంతోనే.. కిట్ చెక్కామని తెలిపారు.