క్లీన్ ఆంధ్రప్రదేశ్‌పై ముఖ్యమంత్రి రివ్యూ

క్లీన్ ఆంధ్రప్రదేశ్‌పై ముఖ్యమంత్రి రివ్యూ

దేశంలో విద్యుత్ ఉత్పత్తి సమస్యగా మారిన నేపథ్యంలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌పై ముఖ్యమంత్రి శుక్రవారం రివ్యూ నిర్వహించారు. క్లాప్ కార్యక్రమం కింద చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు. వ్యర్థాల తొలగింపులో అధికారులు అత్యుత్తమ విధానాలు పాటించాలని ఆదేశించారు.

గ్రేడ్- 2,3, నగర పంచాయతీలకు క్లాప్ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ ఆయా ప్రాంతాలకు చేరవేయాలని సీఎం చెప్పారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని వీలైనంత వేగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెప్పించుకోవాలని ఆదేశించారు. నగరాల్లో, పట్టణాల్లో గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించడమే కాకుండా దుర్వాసన ఆ ప్రాంతంలో రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా గుంటూరులో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం సిద్ధమైందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్లపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడంపైనే కాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.

క్లాప్‌ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూపంలో సమర్థులైన అధికారులను పెట్టి.. వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో డస్ట్‌బిన్స్‌ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్‌ ఇవ్వాలని, విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలని.. ఎక్కడా కూడా మురుగునీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. దీన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని సూచించారు.