ఉల్లిపాయలతో సాల్మనెల్లోసిస్ వ్యాధి

ఉల్లిపాయలతో సాల్మనెల్లోసిస్ వ్యాధి

అమెరికాలో సాల్మనెల్లోసిస్ వ్యాధి ఆందోళనకు గురిచేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఈ కేసులు భారీగా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తికి సాల్మొనెల్ల బ్యాక్టీరియా కారణం కాగా.. ఉల్లిపాయలతో దీనికి సంబంధం ఉందని అమెరికా సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ నిర్దారించింది. అక్టోబరు 18 నాటికి 37 రాష్ట్రాల్లో 652 మంది వ్యాధి బారినపడ్డారని, వీరిలో 125 మంది ఆస్పత్రిలో చేరారని సీడీసీ పేర్కొంది. ఇది మరింత విస్తరిస్తే మరిన్ని అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మే 15 నుంచి సెప్టెంబరు 30 మధ్యలోనే ఈ కేసులు వచ్చినా.. ఏ ఆహారం వల్ల వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. చిహువా, మెక్సికో నుంచి ప్రోసోర్స్ అనే సంస్థ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని దేశంలోని అనేక రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలకు పంపిణీ చేసింది. ఆగస్టు 27న చివరిసారి ఇక్కడి నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకున్నారు. వాటిని ఇళ్లు, రెస్టారెంట్లలో వినియోగించారని సీడీసీ తెలిపింది. ఇవే ప్రస్తుతం 75 శాతం మందిలో వ్యాధి వ్యాప్తికి కారణాలని అధికారులు గుర్తించారు.

అయితే, ఇతర ఉల్లిపాయల సరఫరాదారులకు ఈ సాల్మొనెల్లా వ్యాప్తితో సంబంధం ఉందా? అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు నెలలపాటు నిల్వ చేసిన ఉల్లిపాయలు, సాల్మొనెల్లా ప్రభావితమైన వాటిని వాడవద్దని సీడీసీ హెచ్చరించింది. ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకపోయినా, మెక్సికో నుంచి వచ్చినవి, ఎలాంటి స్టిక్కర్ లేకుండా.. ప్రోసోర్స్ నుంచి వచ్చిన ఉల్లిపాయలైనా.. వాటిని బయట పడేయాలని సూచించింది.

కాగా, జులై 1 నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వెనక్కు తీసుకునేందుకు ప్రోసోర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఇప్పటికే అన్నీ దుకాణదారులు ఉల్లిపాయలు తిరిగి వెనక్కు పంపాలని ప్రోసోర్స్ రీకాల్ నోటీసులు జారీ చేసిందని FDA తెలిపింది.

సాల్మొనెల్లా బాధితుల్లో డయేరియా, వాంతులు, జ్వరం, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ బాక్టీరియా ఉన్న ఉల్లిపాయలు తింటే.. ఆరు గంటల నుంచి ఆరు రోజుల్లో సాల్మొనెల్లోసిస్ వ్యాధి వ్యాపిస్తోందని సీడీసీ తెలిపింది. చాలా మంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే నాలుగు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటున్నారని సంస్థ ప్రకటించింది. ఈ వ్యాధి వ్యాప్తిని గుర్తించేందుకు దిగుమతైన అన్ని రకాల ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

టెక్సాస్‌లో అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, మేరీల్యాండ్‌లో 58, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మిస్సోరీలో 21 కేసులు నమోదయ్యాయని సీడీసీ తెలిపింది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించిన కేసుల కన్నా బాధితుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చని సీడీసీ అభిప్రాయపడింది. చాలా మందికి సాల్మొనెల్లా పరీక్షలు చేయకముందే వారు కోలుకుంటున్నారని సంస్థ తెలిపింది.