పురుషులపై కోవిడ్ ప్రభావం

పురుషులపై కోవిడ్ ప్రభావం

కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతీయుల ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు పడిపోయిందని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ నిర్వహించిన అస్టాటిస్టికల్ స్టడీ వెల్లడించింది. ఐఐపీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూరయకాంత్ యాదవ్ ప్రకారం, పురుషులు, స్త్రీల ఆయుర్దాయం 2019 సంవత్సరంలో 69.5 సంవత్సరాలు, 72 సంవత్సరాల ఉండగా.. 2020లో అది వరుసగా 67.5 సంవత్సరాలు, 69.8కి తగ్గిందని తెలిపారు.

మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనివల్ల దేశవ్యాప్తంగా మరణాల నమూనాలపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని విశ్లేషించడానికి ఈ అధ్యయనం నిర్వహించారు. 35-69 ఏళ్లలోపు పురుషులపై కోవిడ్ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. కోవిడ్ కారణంగా ఈ వయస్సు వారు అధికంగా మరణించడంతో వారి ఆయుర్దాయం గణనీయంగా పడిపోయినట్లు స్టడీ తెలిపింది.

ఐఐపీఎస్‌ 145 దేశాల గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ స్టడీ అండ్‌ కోవిడ్-ఇండియా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్ పోర్టల్ ద్వారా సేకరించిన డేటాపై నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ ప్రభావం గత దశాబ్దంలో ఆయుర్దాయం వయసును పెంచడానికి మేము చేసిన కృషిని, సాధించిన పురోగతిని కోవిడ్‌ తుడిచిపెట్టేసింది.

మహమ్మారి ఫలితంగా ప్రస్తుతం భారతదేశ ఆయుర్దాయం ఇప్పుడు 2010లో ఉన్నట్లే ఉంది. దానిని చేరుకోవడానికి మాకు సంవత్సరాలు పడుతుంది’’ అని తెలిపారు.అయితే, ఆఫ్రికాతో సహా దేశాల్లో గతంలో వచ్చిన అంటువ్యాధులు ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం చూపాయని, అయితే కొన్ని సంవత్సరాల్లో అది తిరిగి పూర్వ స్థితికి వచ్చిందని ఐఐపీఎస్‌ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ జేమ్స్ తెలిపారు.