పెవిలియన్ చేరుతూ భావోద్వేగానికి గురయిన ధోనీ…కన్నీటి పర్యంతమైన సాక్షి

dhoni reached to pavilion emotionally

వరల్డ్ కప్ సెమీస్‌ లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓడింది. వన్డే చరిత్రలో తొలిసారి టాప్-3 బ్యాట్స్‌మెన్ ముగ్గురూ ఒక్కో పరుగు చొప్పున మాత్రమే చేసి ఔటైన వేళ కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యం టెన్షన్ ని పెంచింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను పాండ్య, పంత్ ఆదుకున్నారు. వీరిద్దర్నీ  పెవిలియన్ చేర్చాక.. భారత్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ధోనీ, జడేజా మెల్లగా భారత్ ఇన్నింగ్స్ నిర్మించారు. జడేజా కెరీర్లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 77 పరుగులు చేసిన జడ్డూ ఔటయ్యాక చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం అయ్యాయి. ధోనీ ఉండటంతో గెలుస్తాంలే అనే ధీమా అభిమానుల్లో కనిపించింది. 49వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన ధోనీ అదే ఓవర్ మూడో బంతికి రెండో పరుగుకు యత్నించాడు. కానీ దురదృష్టం కొద్దీ గుప్టిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు మహీ బలయ్యాడు. బంతి వికెట్లకు తాకినప్పుడు క్రీజుకు కొద్ది అంగుళాల దూరంలో ధోనీ బ్యాట్ ఉండిపోయింది. ఊహించని రీతిలో రనౌట్ కావడంతో ధోనీ భావోద్వేగానికి లోనయ్యాడు. మైదనానికి నడుస్తున్నప్పుడు ధోనీ కళ్లలో సుడులు కనిపించాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలుకుతాడని వార్తలు వస్తున్న వేళ ఈ దిగ్గజ క్రికెటర్ కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారమైన హృదయంతో మైదానాన్ని వదలడం కోట్లాది మంది భారత అభిమానులను కలచి వేసింది. ధోనీ అవుటయ్యాక భార్య సాక్షి కంటి నుంచి నీర ధారలా వచ్చేసింది. ఏడుపును ఆపుకోవడం ఆమె వల్ల కాలేదు.