జేసీ నోటి దురద వ్యాఖ్యలు…ఈసీ నోటీసులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.10వేల కోట్లకు పైగానే ఖర్చు అయిందని కొద్దిరోజుల క్రితం సంచలనం వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10వేల కోట్లు ఖర్చు చేశాయని, ప్రతి నియోజకవర్గంలోనూ ఖర్చు రూ.50కోట్లు దాటిపోయిందని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్మంతా అవినీతి ద్వారా సంపాదించనేదని, ఒక్కో నాయకుడు ఓటును రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చుపెట్టి కొనుకున్నాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.25కోట్లు దాటిపోయిందన్నారు. జేసీ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ, సీపీఐ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దాన్ని పరిశీలించిన ఈసీ అధికారులు దివాకర్‌ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నిర్ధారించారు. దీంతో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నివేదిక సమర్పించాలని స్థానిక అధికారులకు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల సంఘం చర్యలపై జేసీ వర్గం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. కొద్దిరోజుల క్రితం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.