భలే మేనేజ్ చేస్తున్న రవి ప్రకాష్…12 రోజుల్లో 30 సిమ్ కార్డులు మార్చి మరీ ?

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఈనెల 22న విచారణ చేయాలని నిర్ణయించింది. రవిప్రకాష్ పై సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీ కేసు నమోదైన సంగతి తెలిసిందే కాగా విచారణకు హాజరవ్వాలని ఇప్పటికే రెండుసార్లు నోటీసులు పంపించినా విచారణకు హాజరుకాకపోవడంతో ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీచేసి గాలిస్తున్నారు. కొంతసమయం కావాలని కోర్టును కోరిన రవిప్రకాష్ అందుకు కోర్టుకు అంగీకరించకపోవడంతో అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. టీవీ9 వాటాల వివాదం ప్రస్తుతం విచారణలో ఉందని, అది పూర్తి కాకుండా, పోలీసులు కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నది రవిప్రకాశ్ వాదన. తెలుగు న్యూస్ చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు 30 సిమ్ కార్డులను మార్చినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన ఈ నెల 9వ తేదీ నుంచి ఇంతవరకూ ఆయన రోజుకు రెండు నుంచి మూడు సిమ్ లను మారుస్తూ వచ్చారని, పోలీసులు అంటున్నారు. సాంకేతికంగా తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి.