ముంబయిలో డెల్టా ప్లస్ తొలి మరణం

ముంబయిలో డెల్టా ప్లస్ తొలి మరణం

మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముంబయికి చెందిన ఓ 63 ఏళ్ల వృద్ధురాలు ఈ వేరియంట్ సోకి ప్రాణాలు కోల్పోయింది. ఆమె రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్‌తో మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ముంబయిలో డెల్టా ప్లస్ తొలి మరణం ఇదేనని అధికారులు నిర్ధారించారు. వృద్ధురాలికి జులై 21న కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అదే రోజు ఆమె ఆసుపత్రిలో చేరారని తెలిపారు. పొడి దగ్గు, ఒళ్లునొప్పులు, రుచి కోల్పోవడం మొదలైన లక్షణాలు ఆమె కనిపించాయని పేర్కొన్నారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల ఐసీయూలో చేర్చి చికిత్స అందజేసినప్పటికీ ఆమె జులై 27న చనిపోయినట్టు స్పష్టం చేశారు. ఆ వృద్ధురాలికి డెల్టా ప్లస్ వేరియంట్(ఏవై.1) సోకినట్లు ఆగస్టు 11న బృహన్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ముంబయిలో చనిపోయిన మహిళ సహా పూర్తిస్థాయి టీకా తీసుకున్న మరో ఏడుగురికి డెల్టా ప్లస్ వేరియంట్ నిర్ధారణ అయ్యింది. దీంతో వీరితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించేపనిలో ఉన్నారు. చనిపోయిన మహిళతో కాంటాక్ట్ అయిన ఇద్దరికి డెల్టా ప్లస్ పాజిటివ్‌ వచ్చింది.

కోవిడ్-19కు ముందు ఆమె ఎటువంటి ప్రయాణాలు చేయలేదని గుర్తించారు. చికిత్స సమయంలో ఆక్సిజన్, స్టెరాయిడ్స్, రెమ్‌డెసివిర్‌ను కూడా వినియోగించినట్టు అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో ఇది డెల్టా ప్లస్ రెండో మరణం. రత్నగిరిలో ఏ 80 ఏళ్ల వృద్ధుడు గత నెల ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య 65 కి చేరింది. బుధవారం ఒక్క రోజే 17 మందికి వేరియంట్ సోకినట్టు బయటపడింది. ముంబయిలో ఏడు, నాందేడ్, గొండియా, రాయ్‌గఢ్, పాల్ఘర్‌లో రెండేసి, చంద్రపూర్, అకోలాలో ఒక్కొక్కటి చొప్పున నిర్ధారణ అయ్యాయి.

మొత్తం కేసుల్లో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది వృద్ధులు ఉన్నారు. దీంతో వీరిని కాంటాక్ట్ అయిన వ్యక్తులను అధికారులు గుర్తిస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా కేవలం 86 డెల్టా ప్లస్ కేసులే నమోదయ్యాయని, దీని వ్యాప్తి అంత వేగంగా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా మహారాష్ట్రలో నమోదుకాగా.. తర్వాత మధ్యప్రదేశ్, తమిళనాడులో ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చీఫ్ సుజీత్ సింగ్ తెలిపారు.