ఇద్దరు యువకులు దుర్మరణం

ఇద్దరు యువకులు దుర్మరణం

ఓ రోడ్డు ప్రమాదం ఇద్ద రు స్నేహితులను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. చెట్టెత్తు కొడుకులు అందనంత ఎత్తు ఎదుగుతారని కలలు కన్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. అంతులేని విషాదం నింపిన ఈ దుర్ఘటన వివరాలు ఇ లా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బుధవా రం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణాపూర్‌కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానిక భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి తుమ్మేటి మేఘనాథ్‌, డిప్లొమో పూర్తిచేసిన మరో విద్యార్థి పసునూటి మదన్‌మోహన్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మేఘనాథ్‌ తండ్రి శ్రీనివాస్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మదన్‌మోహన్‌ తండ్రి రాము బజ్జీకొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌ ఏరియాకు చెందిన ఇద్దరు స్నేహితులు మేఘనాథ్, మదన్‌మోహన్‌లు స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్తున్నామని మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నామనేది ఎవరికీ స్పష్టతనివ్వకుండానే ఇంట్లో నుంచి బైక్‌పై బయలుదేరారు. మరుసటిరోజు ఉదయం కరీంనగర్‌ వద్ద ఆగి ఉన్న డీసీఎంను వీరి బైక్‌ ఢీకొని మేఘనాథ్, మదన్‌మోహన్‌లు చనిపోయినట్లుగా కబురు వచ్చింది. మృతులు ఇద్దరు కూడా ఇంట్లో చిన్నవారు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు.

కళ్ల ముందున్న కొడుకులు ఒక్కరోజు గడువులోనే విగత జీవులు కావడం ఇరు కుటుంబాలను కోలుకోలేకుండా చేసింది.రామకృష్ణాపూర్‌కు చెందిన బజ్జీల కొట్టు నిర్వాహకుడు రాము ఇంట్లో వరుస ఘట నలు కుదిపేస్తున్నాయి. కొద్దిరోజుల క్రిత మే రాము సోదరుడు, యువత బుక్‌స్టాల్‌ నిర్వాహకుడు రవి భగత్‌సింగ్‌నగర్‌లో రోడ్డు పక్కనే బైక్‌పై ఆగి ఉండగా ఓ ఎద్దు పొడవటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మృతిచెందాడు. రవి చనిపోయి నెలరోజులు కూడా గడవకముందే రాము చిన్నకుమారుడు మదన్‌మోహన్‌ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడటంతో కుటుంబమంతా గుండెలవిసేలా విలపిస్తున్నారు.