ప్రధాని మోదీతో మెగా కోడలు

ప్రధాని మోదీతో మెగా కోడలు

మెగాస్టార్ కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్‌ చైర్‌ పర్సన్‌గా బిజీగా ఉంటూనే.. మరోవైపు పర్యావరణ ప్రేమికురాలిగా.. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే మహిళగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. తాజాగా ఉపాసన.. దుబాయ్ 2020 ఎక్స్‌పోను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయిన విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

‘భారత ప్రధాని నరేంద్ర మోదీని దుబాయ్‌ 2020 ఎక్స్‌పో వద్ద భేటీ అవ్వడం ఎంతో గౌరవప్రదంగా ఉంది. ఎన్నో రకాల కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్ష, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాన్ని ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి.

చంద్రుని మీద దక్షిణ ధృవంపై నీరు ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు ఇండియానే మొట్టమొదటి సారిగా చంద్రయాన్ ప్రయోగం చేసిందని మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు ఈ ఎక్స్‌పో కార్యక్రమంలో ఉన్నాయి. మీ మీ పిల్లలను అక్కడికి తీసుకెళ్లండి. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మిస్ అవ్వకండి.. మాస్కులు ధరించండి.. శానిటైజ్ చేసుకోండి.. భౌతిక దూరం పాటించండి.. అప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు’ అని ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది.

దీంతో ప్రధాని మోదీని ఉపాసన నిజంగా కలిశారంటూ పొరపడుతున్నారు కొందరు. అయితే అందులో వాస్తవం లేదు. ఆమె అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా ప్రధాని మోదీ పక్కన కూర్చున్నట్లు ఫోటో దిగారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టా పోస్ట్‌లో మెన్షన్‌ చేశారు కూడా. కానీ, కొన్ని సైట్లు పొరపాటుగా అర్థం చేసుకుని ఉపాసన నిజంగానే మోదీతో ముఖా ముఖి భేటీ అయినట్లు వార్తలు రాసుకొచ్చాయి. దీంతో ఉపాసన పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

అగ్‌మెంటెడ్ రియాలిటీ అనేది సాంకేతికతో మనిషి చూసే వాస్తవ దృశ్యాన్ని పూర్తిగా కంప్యూటర్ ద్వారా కల్పిత దృశ్యంతో భర్తీ చేస్తుంది. వివరంగా చెప్పాలంటే, అగ్‌మెంటేషన్‌ అనేది, మన చుట్టూ ప్రత్యక్షం చేసే వాస్తవ దృశ్యాల్లో కల్పిత వస్తువులను కంప్యూటర్ సహాయంతో ఇమడింపచేసి చూపే నిరంతర ప్రక్రియ. ఈ టెక్నాలజీని ఉపయోగించి.. దుబాయ్‌ 2020 ఎక్స్‌పోలో భారత పార్లమెంట్‌, ప్రధాని మోదీ ఉన్నట్లు ఆవిష్కరించారు అంతే!