భర్త ఎదుటే వివాహితపై సామూహిక అత్యాచారం

భర్త ఎదుటే వివాహితపై సామూహిక అత్యాచారం

భర్త ఎదుటే ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఓ టోల్ ప్లాజా వద్ద కారులో వచ్చిన నలుగురు వారిని అడ్డగించారు. భర్తను కొట్టి భార్యపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సింధారీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్మేర్‌కు చెందిన దంపతులు మంగళవారం సాయంత్రం బలోత్రాకు బైక్‌పై బయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో నలుగురు దుండగులు అడ్డగించి వాహనం లాగేసుకున్నారు.

వారి బైక్‌ను ఓ యువకుడు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించాడు. మిగతా ముగ్గురు ఆమె భర్తను తీవ్రంగా కొట్టి.. దంపతులను బలవంతంగా కారులోకి ఎక్కించారు. అనంతరం కదులుతున్న వాహనంలోనే ముగ్గురూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాధితులను సర్నూ టోల్ ప్లాజ్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో వదిలేశారు. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న భార్యభర్తలను చూసిన స్థానికులు.. తక్షణమే స్పందించారు. వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై సింధారీ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. భార్యభర్తలు ఇద్దరూ జరిగిన ఘటన గురించి వివరించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు నిందితులు కమ్తాయ్ జాట్ , బాబులాల్ జాట్, నరేష్‌ జాట్లను అరెస్టు చేసినట్లు బార్మర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆనంద్ శర్మ తెలిపారు. ముగ్గురూ కంథాయ్‌కు చెందినవారిగా గుర్తించారు. బైక్ తీసుకుని పరారైన నాలుగో నిందితుడు కిషన్ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

నిందితులపై ఐపీసీ సెక్షన్ 365, 375డి, 384 కింద కేసు నమోదయినట్టు ఎస్పీ చెప్పారు. భార్యాభర్తలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారని, అదే ఆస్పత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తిచేసినట్టు ఎస్పీ వివరించారు. ఇరువుర్నీ ఇంటికి పంపామని, బాధితురాలు షాక్‌లో ఉందన్నారు. ఇదిలా ఉండగా, గత కొద్ది నెలలుగా బర్మేర్ జిల్లా వార్తల్లో నిలుస్తోంది. ఈ జిల్లాలో సామూహిక ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి.