యువతిని మోసం చేసిన స్నేహితులు

యువతిని మోసం చేసిన స్నేహితులు

సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తామనని చెప్పి యువతిని లైంగికంగా వాడుకున్న ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తనపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన యువతి పోలీసులు విచారణకు వెళ్తున్న సమయంలో ఆత్మహత్యకు యత్నించడం అందరినీ కలిచివేసింది.

వివరాల్లోకి వెళ్తే…. ఈరోడ్‌ జిల్లాకు చెందిన యువతి(24) చెన్నై సాలిగ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ మూడేళ్లుగా ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అడయార్‌కు చెందిన గణేష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తనకు అనేక మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తెలుసునని మాయమాటలు చెప్పిన గణేష్‌ ఆమెను లైంగికంగా వాడుకున్నాడు. ఆపై బ్లాక్‌మెయిల్ చేస్తూ గణేష్ స్నేహితులు సైతం ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఎన్ని రోజులు గడిచినా గణేష్‌ ఆమెకు సినిమా ఛాన్సులు ఇప్పించకపోగా.. తాను చెప్పిన వారి వద్దకు వెళ్లి కోరికలు తీర్చాలంటూ వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు గణేష్‌ అతని స్నేహితులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల అడయార్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం సాయంత్రం విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌ రావాల్సిందిగా యువతిని మహిళా పోలీసులు కోరగా స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరింది.

వడపళని సమీపంలో యువతి ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో స్నేహితుడు ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. తన ఆత్మహత్యకు గణేష్ కారణమని రాసిన లేఖను యువతి బ్యాగులో పోలీసులు గుర్తించారు.