అభిమానులు ఎవరూ హైదరాబాద్ రావొద్దు

అభిమానులు ఎవరూ హైదరాబాద్ రావొద్దు

జులై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ హైదరాబాద్ రావొద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న వేళ, సీఎం కేసీఆర్ వారి ఆదేశాల మేరకు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్దేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల సహాయక చర్యల్లో అందరూ పాల్గొనాలని కేటీఆర్ కోరారు. ఇలా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం కంటే సంతోషకరమైన విషయం తనకు ఏమీ ఉండబోదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల తన పుట్టిన రోజైన జులై 24న ఎవరినీ కలవడం లేదని, ఈ విషయంలో తప్పుగా అనుకోవద్దని కేటీఆర్ చెప్పారు.

మరోవైపు, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా వికలాంగులకు ఇవ్వనున్న మూడు చక్రాల వాహనాల కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిస్తారని కేటీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.