ఘోరానికి పాల్పడిన బామ్మ

ఘోరానికి పాల్పడిన బామ్మ

కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ మహిళ తన మనవడిని కిరాతకంగా హత్య చేసింది. పసివాడు అనే కనికరం కూడా లేకుండా ఆ బామ్మ ఈ ఘోరానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. వివరాల ప్రకారం, కోయంబత్తూరులోని అన్బాగం వీధిలో నాగలక్షి అద్దె ఇంట్లో నివసిస్తూ ఓ హోటల్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, ఆమె కుమార్తె నందినికి (24) వృత్తిరీత్యా కాల్ టాక్సీ యజమాని కమ్ డ్రైవర్ నిత్యానందంతో వివాహం జరిగింది.

అయితే ఆమె కోరికకు విరుద్ధంగా తన కుమార్తె వివాహం చేసుకున్నందుకు నాగలక్షి నిత్యానందంపై పగ పెంచుకుంది. ఎనిమిది నెలల క్రితం, నందిని తన భర్తతో అభిప్రాయభేదాల కారణంగా ఆమె తన చిన్న కుమారుడిని తీసుకుని నాగలక్ష్మి ఇంటికి వెళ్లింది. గత కొన్ని రోజులుగా, నాగలక్షికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నందిని హోటల్‌లో పనిచేయడం ప్రారంభించింది. మంగళవారం రాత్రి పని నుంచి తిరిగి వచ్చిన నందిని తన బిడ్డ శ్వాస తీసుకోకపోవడం గమనించి, అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది.

అక్కడ బాలుడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణంపై అనుమానంతో నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా అందులో పిల్లాడి పుర్రె పగిలిపోయిందని, అతని గొంతులో బిస్కెట్ రేపర్ దొరికిందని నివేదిక పేర్కొంది. పోలీసుల విచారణలో, నాగలక్షి చిన్నారిని చంపినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేశారు.