హైదరాబాద్ నడిబొడ్డున బస్సులో కాల్పుల కలకలం

హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్సులో ఈరోజు తుపాకీ కాల్పులు జరిగాయి. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ఈరోజు పంజాగుట్ట చౌరస్తా నుంచి కొండాపూర్ వైపు వెళ్తున్న 47 ఎల్‌ ఆర్టీసీ బస్సులో సఫారి సూట్ వేసుకున్న ఓ వ్యక్తి ఎక్కాడు. ఈ సందర్భంగా ఫుట్ బోర్డుపై నిలుచున్న అతడిని కిందకు దిగాలని డ్రైవర్ కోరగా, దిననని మొండికేశాడు. ఈ సందర్భంగా ప్రయాణికులతో వాగ్వాదం చెలరేగడంతో ఒక్కసారిగా తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ పైనుంచి దూసుకెళ్లింది. కాగా, ఈ ఘటనపై ఇటు బస్సు డ్రైవర్, అటు కాల్పులు జరిపిన వ్యక్తి ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.