హా.. మేం ఇంకా ఐపీఎల్ కొట్టలే.. విరాట్ కోహ్లీని వార్నర్ ట్రోల్

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. రెండు సార్లు ఆ జట్టు ఫైనల్‌కి చేరినప్పటికీ.. నిరాశ తప్పలేదు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మధ్య ఆధిపత్య పోరు గత కొన్ని సీజన్లుగా జరుగుతూనే ఉంది. అయితే.. మునుపటి వలెనే డేవిడ్ వార్నర్ నోరు జారడం లేదు. కానీ అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీపై మాత్రం సెటైర్స్ పేలుస్తూనే ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

అయితే కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే సమయం గడుపుతున్న డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ టీమ్ సహచర ఓపెనర్ జానీ బెయిర్‌‌స్టోతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడాడు. ఈ సమయంలో ఐపీఎల్ టైటిల్స్ పై చర్చ సాగింది. ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. నా అంచనా ప్రకారం విరాట్ కోహ్లీ ఈ లైవ్ సెషన్‌ని చూస్తుంటాడు..’ అంటూ డేవిడ్ వార్నర్ వ్యంగ్యాస్త్రాన్ని విసిరాడు. కాగా 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా..

ఇప్పటివరకు 12 సీజన్లను దిగ్వజయంగా ముగించుకుంది. కానీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు. దీంతో 2016 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్‌కి చేరిన బెంగళూరు టీమ్.. ఆఖర్లో చేసిన పొరపాటుల వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి టైటిల్‌‌ని అప్పగించాల్సి వచ్చింది. 2019 ఐపీఎల్ సీజన్‌లో కనీసం ప్లేఆఫ్‌కి కూడా ఆర్సీబీ అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే.