ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

మూడు రోజులుగా భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక 9 జిల్లాలకు ఆరెంజ్‌, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.ఇప్పటికే భారీ వర్షాలతో వాంగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులతో పాటు ప్రాజెక్టులు కూడా మత్తడి దూకుతున్నాయి. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు పంపాలని ఆదేశించారు.