భార్యను చంపిన భర్త

భార్యను చంపిన భర్త

ప్రేమ వివాహం చేసుకున్న భార్యను చంపేశానని అత్తకు ఫోన్‌ చేసి బెదిరించిన అల్లుడిపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. సేకరించిన వివరాల మేరకు.. తాడేపల్లి పట్టణ పరిధిలోని యాదవుల బజారులో నివాసముండే పేరం రాములు, పేరం నరసమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. తండ్రి చనిపోయాడు. ఐదుగురు కూతుళ్లు వివాహాలు చేసుకుని ఎవరికి వారు జీవిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగం చేసి, వలంటరీ రిటైర్‌మెంట్‌ చేసుకున్న పేరం రాములు భార్య అయిన నరసమ్మకు రూ.30 లక్షల నగదు వచ్చింది.

ఆ నగదును ఎలాగైనా కాజేయాలని ప్రేమ వివాహం చేసుకున్న నాల్గవ కుమార్తె పేరం వరలక్ష్మి భర్త అయిన కామినేని ప్రశాంత్‌కుమార్‌ పన్నాగం పన్నాడు. ఇల్లు కొనిస్తానంటూ నరసమ్మ వద్ద రూ.30 లక్షల నగదు, మిగిలిన నలుగురు కుమార్తెల వద్ద రూ.5 లక్షలు తీసుకుని భార్యతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ప్రశాంత్‌కుమార్, అతని భార్య ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేశారు. దీంతో అత్తకు అనుమానం వచ్చి గన్నవరంలోని అల్లుడు కామినేని ప్రశాంత్‌కుమార్‌ ఇంటికి వెళ్లింది. అక్కడ అతని తల్లిదండ్రులు మాకు తెలియదని చెప్పారు.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అల్లుడు ఫోన్‌ చేసి నీ కూతుర్ని చంపి పూడ్చిపెట్టాను. ఈ విషయాన్ని బయటకు చెబితే మిగిలిన నలుగురు కూతుళ్లను, నన్ను చంపుతానని బెదిరించి, ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దీంతో తనను, తన కూతుళ్లను రక్షించాలంటూ నరసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌కుమార్‌ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.