ప్రపంచ దేశాలకు ధీటుగా.. భారత్ కరోనా వ్యాక్సిన తయారీ

ప్రపంచ దేశాలను వణికించేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు విశ్వమంతా ఆలోచిస్తుంది. కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కరోనా వాక్సిన్ కోసం తీవ్ర కృషి చేస్తున్నాయి. అయితే భారత్‌లో కూడా సుమారు ఆరు సంస్థలు టీకా తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే సమయంలో అనేక సవాళ్లు ఉంటాయి.

కాగా కరోనా వ్యాక్సిన్ కోసం మిగతా ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కూడా ఆరు సంస్థలు తీవ్ర ప్రయత్నాలు జరుపుతుంది. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో అనేక సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొనే విరుగుడు అందుబాటులోకి రావాలంటే చాలా కాలం పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ తయారీలో జైడస్ కాడిలా రెండు వ్యాక్సిన్‌లపై ప్రయోగాలు చేస్తోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, మైన్‌ వ్యాక్స్ వంటి ఆరు సంస్థలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయని గగన్‌దీప్ కాంగ్, టీహెచ్‌ఎస్‌టీఐ పేర్కొన్నారు.

అంతేకాకుండా వ్యాక్సిన్ రూపొందించడం అంటే అంత ఈజీ కాదని.. దాని అభివృద్ధి దీర్ఘకాల ప్రక్రియ అని రాజీవ్‌గాంధీ జీవ సాంకేతిక కేంద్రంలోని శాస్త్రవేత్త శ్రీకుమార్ తెలిపారు. పలు దశల పరీక్షలను దాటేందుకు, ప్రభుత్వాల ఆమోదం పొందేందుకు నెలల సమయం పడుతుందని వివరించారు. కాగా వ్యాక్సిన్ తాయారైన తర్వాత కూడా అనేక సవాళ్ల ఉంటాయని వారు పేర్కొంటున్నారు. అన్ని వయస్సుల వారిపై ఇది పని చేస్తుందా? లేదా జన్యు నిర్మాణాన్ని మార్చుకునే క్రమంలో దాన్ని ఎదుర్కోగలదా? వంటి సమస్యలు తలెత్తుతాయని శ్రీకుమార్ వెల్లడించారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వివరాల ప్రకారం.. ఏకంగా 70 సంస్థలు వ్యాక్సిన్ తయారీపై కృషి చేస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో లిస్ట్ లో జైడస్ కాడిలా, సీరమ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. అలాగే అటు అమెరికా, చైనా కూడా వ్యాక్సిన్‌ని తయారు చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రకాల వ్యాక్సిన్‌లు తయారు చేసి జంతువులపై, కొందరి మనుషులపై ప్రయోగించాయి. అయితే అవి అంతగా సక్సెస్ కాలేదని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.