ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌

ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌

ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఫామ్‌లోకి వచ్చాడు. రాజస్తాన్‌ ఇచ్చింది స్వల్ప లక్ష్యమే అయినా.. ముంబై చకచకా చేధించడంలో ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కీలకపాత్ర పోషించింది. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఇషాన్‌ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌ ఆరంభమైనప్పటి నుంచి ఇషాన్‌ కిషన్‌ వరుసగా నిరాశపరుస్తూ వచ్చాడు. ఒక మ్యాచ్‌లో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు.

ఇదే సమయంలో టి20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడడం.. ఇషాన్‌ కిషన్‌ ఫామ్‌ సెలక్టర్లను ఆందోళన కలిగించింది. దీంతోపాటు అతని ఆటతీరుపై అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజా ప్రదర్శనతో ఇషాన్‌ విమర్శకులు నోళ్లు మూయించాడు. దీంతోపాటు ఇషాన్‌ కిషన్‌ ముంబై ఇండియన్స్‌ తరపున ఒక రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై తరపున ఇషాన్‌ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లో ఐదో బంతికి సింగిల్‌ తీసిన ఇషాన్‌ ఈ రికార్డు సాధించాడు. కాగా ఇషాన్‌ ప్రదర్శనపై కొందరు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ”ఇషాన్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు.. సంతోషం.. ఇదే కొనసాగించు” అంటూ కామెంట్స్‌ చేశారు.