‘ఇస్మార్ట్ శంకర్’ నేనే అంటున్న రనవీర్ సింగ్

'ఇస్మార్ట్ శంకర్' నేనే అంటున్న రనవీర్ సింగ్

చాలా కాలం తరువాత పూరి కెరీర్‌లో వచ్చిన  ఇస్మార్ట్ శంకర్‌  బిగ్‌ హిట్ కావటంతో చిత్రయూనిట్‌ సక్సెస్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. రామ్‌ కూడా ఈ సినిమాను గట్టిగానే సెలబ్రేట్ చేస్తున్నాడు. తెలుగులో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం పరభాషా దర్శక నిర్మాతలు తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు. మన సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌లో సత్త చాటటమే కాదు. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో రీమేక్‌ చేసేందుకు కూడా నిర్మాతలు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. అదే బాటలో ఇస్మార్ట్ శంకర్‌ కూడా బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.

రామ్‌ సరసన నిధి అగర్వాల్, నబా నటేష్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించాడు. ఇటీవల బిగ్‌ హిట్స్‌లో ఒకటిగా నిలిచి ఇస్మార్ట్‌ శంకర్‌పై బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను పడింది. ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రీమేక్‌ రైట్స్‌కు కూడా సొంతం చేసుకున్న ఈ సంస్థ త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇస్మార్ట్ శంకర్‌ బాలీవుడ్‌ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్‌ చేయబోతున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే పూరి ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌ను కూడా ప్రకటించాడు.