ఢిల్లీ వెళ్తున్న జగన్, కేటీఆర్…ఎందుకంటే ?

jagan and ktr going to delhi

ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనుల్లో తాను తీరిక లేకుండా ఉండటం వల్ల పార్టీ తరఫున కేటీఆర్‌ను పంపిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన అంశాల మీద అలాగే జమిలీ ఎన్నికల విషయం గురించీ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. 17వ లోక్‌సభ పార్లమెంట్‌ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమవగా మొదటి రెండు రోజులూ కొత్తగా ఎంపికైన సభ్యులందరూ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు రేపు స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ తదితర కీలక ప్రక్రియలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. దేశంలోని పార్టీలన్నింటికీ ఇప్పటికే లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌, టీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్‌ ఈ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కావడం లేదు. విదేశీ పర్యటనకు వెళ్తున్నందున ఆయన ఈ సమావేశానికి హాజరు కావట్లేదు.