కోర్టుకి హాజరవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

కోర్టుకి హాజరవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్ సీబీఐ కోర్టులో… దాదాపుగా ఎనిమిది నెలల తర్వాత జగన్ పేరును మూడు సార్లు పలికిన తర్వాత ప్రజెంట్ సార్ అనే కేక వినిపిచనుంది. ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి కోర్టుకు హాజరు కాని జగన్మోహన్ రెడ్డి చివరికి.. కోర్టు హెచ్చరికలు జారీ చేయడంతో.. కోర్టుకు హాజరవనున్నారు. ఉదయం 9.30కి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరనున్న జగన్… 10.10కి బేగంపేట చేరుకుంటారు. 10.30కి సీబీఐ కోర్టుకు హాజరవుతారు. మధ్యాహ్నం 2.20కి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం తిరిగి వెళ్తారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు లేఖ పంపారు. ఏపీ సీఎం శుక్రవారం రోజు.. నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారని.. దానికి తగ్గట్లుగా.. ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం తరపున అధికారిక సందేశం వెళ్లింది.

ఈ మేరకు పోలీసులు ఆ మేరకు నాంపల్లి కోర్టు దగ్గర… ట్రాఫిక్ మళ్లింపు జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు.. అక్రమాస్తుల కేసుల్లో ఏ -2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా.. కోర్టుకు హాజరవుతారు. ముఖ్యమంత్రిహోదాలో ఉన్న నేత… అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు నిందితుడిగా హాజరు కావడం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటి సారి. దేశంలో.. లాలూ ప్రసాద్ యాదవ్, మధుకోడా.. గతంలో ముఖ్యమంత్రులుగా ఉంటూ అవినీతి కేసుల్లో విచారణకు కోర్టుకు హాజరయ్యారు. వీరిద్దరికీ జైలు శిక్షలు పడ్డాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికీ జైల్లోకే ఉండగా.. మధు కోడా శిక్ష అనుభవించారు.

ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. కోర్టు ముందు హాజరవుతున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయి..పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత.. షరతులతో కూడిన బెయిల్‌ను.. జగన్ దక్కించుకున్నారు. అప్పట్నుంచి ఠంచన్‌గా కోర్టుకు హాజరవుతున్నారు. వ్యక్తిగత హాజరీ మినహాయింపు కోసం గతంలో పిటిషన్లు దాఖలు చేసినా… కోర్టులు అనుమతించలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన హోదానే.. చూపించి.. ఆయన కోర్టుకు డుమ్మా కొట్టాలని అనుకున్నారు. కానీ.. చట్టం అందరికీ సమానమేనన్న రాజ్యాంగ సూత్రాలను అనుసరించి.. ఆయన విజ్ఞప్తికి సానుకూల స్పందన రాలేదు. అయినప్పటికీ.. ఏదో సాకులు చెబుతూ… ప్రతీ శుక్రవారం డుమ్మా కొడుతున్నారు. ఈ సారి మాత్రం.. తప్పించుకోలేని పరిస్థితి.