కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విజయవాడలో నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో మొదలయిన భారీ వర్షం 12.15 గంటల వరకు కొనసాగింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది.మరోవైపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వర్షపు నీటితో తడిసి మద్దయింది. ఒక్క సారిగా బలమైన ఈదురు గాలులు వీచడంతో ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు సభా వేదిక చుట్టుపక్కల ఏర్పాటు చేసిన ఎల్ఇడి స్క్రీన్లు కింద పడిపోయాయి. నగరంలో రహదారుల వెంట ఏర్పాటు చేసిన జగన్ భారీ ఫ్లెక్సీలు సైతం నేలకొరిగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలపివేశారు. మరి కొన్ని గంటల్లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉండడంగా భారీ వర్షం పడడంతో స్టేడియం అంతా అయోమయమైన పరిస్థితిలో ఉంది. విఐపీ, వివిఐపీ కుర్చీలు మొత్తం తడిసిపోగా గ్రౌండ్ ప్రాంగణం చాలా వరకూ నీట మునిగింది. అసలు వర్షం పడుతుందనే ఆలోచనే చేయకుండా ఏర్పాట్లు చేయడంతో జగన్ ప్రమాణ స్వీకారం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకుంటే వేదిక మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోపక్క కొన్ని గంటల్లో కృష్ణజిల్లా అంతటా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్జీఎస్ తెలిపింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షం, పిగుగులు పడనున్నాయని సమాచారం.