పోలీసుల మీద జేసీ హాట్ కామెంట్స్…

JC Devakar reddy

గణేష్ నిమజ్జనం సమయంలో తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తులకు అక్కడి ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులకు మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తత తీవ్రతరం అవడంతో జేసీ ఎంట్రీ తర్వాత ప్రభుత్వ బలగాలు ఆశ్రమంలోని వారిని ఖాళీ చేయించడం జరిగిపోయాయి. అయతే ఈ రోజు సచివాలయంలో ఈ అంశం మీద ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్న పొడమలలో పోలీసుల వైఫల్యం కారణంగానే భారీ స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుందని అన్నారు. ఆశ్రమంలోని ప్రబోధానంద వర్గీయులు రాళ్లదాడి చేస్తుంటే తుపాకులు, లాఠీలు ఉన్న పోలీసులు తమ కంటే ముందు పారిపోయారని విమర్శించారు. వారు కనీసం ధైర్యంగా నిలబడి గాల్లోకి కాల్పులు జరిపినా ఇంత విధ్వంసం జరిగేది కాదన్నారు.

AP CM chandrababu and jc devakar reddy

ఆశ్రమానికి కిలోమీటర్ దూరంలో తాను ధర్నాకు దిగితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడకు రాలేదనీ తమను పట్టించుకోలేదని జేసీ విమర్శించారు. ఒకానొక సమయంలో ఎర్రటోపీ పెట్టుకుని పోలీసులు ఊర్లో అడుగుపెడితే చట్ట వ్యతిరేక శక్తులు పారిపోయేవని ప్రస్తుతం అనంతపురంలోని పోలీస్ కానిస్టేబుల్ కాలర్ ను ఓ వ్యక్తి పట్టుకుంటే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేని పరిస్థితికి అధికారులు దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. పోలీసులు కనీసం గాల్లో కాల్పులు జరిపి ఉన్నా, చిన్నపొడమలలో ఇంత ఘర్షణ జరిగేది కాదని తేల్చిచెప్పారు. ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులపై ఐదు సార్లు చుట్టుపక్కల గ్రామస్తులు ఫిర్యాదు చేసినా, నిన్నటివరకూ పోలీసులు పట్టించుకోలేదని వెల్లడించారు. ఆశ్రమంలోకి పోలీసులు ఈ రోజు చేపట్టిన తనిఖీల్లో ఆయుధాలు దొరికాయని తెలిపారు. అలాగే చంద్రబాబు ఏ విషయాన్నీ తొందరగా తేల్చేయరని ఆయన మీద కూడా సెటైర్ వేసారు.