ఇప్పటి నుంచి స్కూల్లో నో జంక్ ఫుడ్

పిల్లలూ ఇప్పటి నుంచి స్కూల్లో నో జంక్ ఫుడ్

సాఫ్ట్‌డ్రింకులు, చిప్స్, బర్గర్, సమోసా, ప్యాకేజ్డ్ జ్యూసులతో సహా అన్ని రకాల జంక్ ఫుడ్‌ను దేశంలోని అన్ని పాఠశాలలు, బోర్డింగ్ స్కూళ్లలో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. డిసెంబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. స్కూళ్లు, బోర్డింగ్ స్కూళ్లలోని కేఫ్‌టేరియాలలో జంక్ ఫుడ్‌ను అమ్మడమే కాదు వాటికి సంబంధించిన ప్రచారాలు చేయడం, ఫ్రీ శాంపిల్స్ అందచేయడం, వెండింగ్ మెషిన్లను పెట్టడాన్ని కేంద్రం నిషేధించింది. వెండింగ్ మెషిన్లపైన, పుస్తకాలు, స్కూలుకు సరఫరా చేసే సామగ్రి, పాఠ్యపుస్తకాల కవర్లపై ఎటువంటి లోగోలను ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు అంటించకూడదు.

అదే విధంగా స్కూలుకు సంబంధించిన ఫర్నీచర్ లేదా ఇతర ఆస్తులపై కూడా ఎటువంటి ప్రచార లోగోలు అంటించరాదు. పాఠశాల విద్యార్థులు అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించే క్రమంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) కొత్త నిబంధనలను రూపొందించింది. కొవ్వు, ఉప్పు, చక్కెర పదార్థాలు అధికంగా సాఫ్ట్ డ్రింకులు, చిప్స్, నూడుల్స్, ఇతర ప్యాక్డ్ ఆహార పదార్థాలను స్కూలులో విక్రయించడంపై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించింది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందచేయడానికి అవసరమైన మెనూను ఎప్పటికప్పుడు రూపొందించుకోవలసిందిగా ప్రభుత్వం పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది.