బాబుకి 5 ప్రశ్నలని సంధించిన కన్నా !

Kanna lakshmi narayana 5 questions to cm chandrababu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటివరకు రెండు వారాలుగా 10 ప్రశ్నలు సంధించిన కన్నా, తాజాగా మూడో వారం కూడా ప్రశ్నలు సంధించారు. తాను సంధించే ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం చెప్పగలరా? అంటూ కన్నా ప్రశ్నించారు.
కన్నా లక్ష్మీనారాయణ సంధించిన ప్రశ్నలు:

1. సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుండి తీసుకుని, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా దారుణంగా వంచించి, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మెజారిటీ వాటా (58%) సింగపూర్ సంస్థలకు దోచిపెట్టడం లేదా? రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

2. మీరు అధికారంలోకి వచ్చే సమయానికి రూ.లక్ష కోట్లు ఉన్న రాష్ట్ర రుణ భారం, ఇప్పుడు ఏకంగా రూ. 2.35 లక్షల కోట్లకు ఎందుకు పెరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వగలరా? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, రాష్ట్రానికి ద్రోహం చేస్తోన్న మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా?

3. గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోవడానికి మీ ప్రచార పిచ్చి కారణం కాదా? మీ వనం-మనం కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఐ.పోలవరంలో అమాయక విద్యార్ధులు చనిపోవడం నిజం కాదా? మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు భాద్యత వహించాల్సిన అవసరం లేదా?

4. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానం చేయించింది మీరు కాదా? ప్యాకేజీలో భాగంగా నిధులు తీసుకుంటూనే, ప్రత్యేక హోదా కావాలనడం దుర్మార్గం కాదా? ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసింది మీరు కాదా?

5. పారదర్శక పాలన అందిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే మీరు అత్యధిక సంఖ్యలో రహస్య జీఓలను జారీ చేసిన విషయం నిజం కాదా? అసలు రహస్య జీఓలను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ అవినీతి కోసం కాదా?
అయితే ఇంతకు ముందు సంధించిన ప్రశ్నలకు కూడా బాబు సమాధానం ఇవ్వలేదు, ఈ ప్రశ్నలకి అయినా ఇస్తారో లేదో మరి