NEET వివాదం.. ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
NEET అంశంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సంకేతాలు వచ్చినప్పటికీ, ప్రతిపక్షాల ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. ఆయన రాజీనామా చేసే వరకు లోక్సభలో చర్చలు జరగనివ్వబోమని స్పష్టం చేస్తూ పార్లమెంట్లో నిరసనలు కొనసాగిస్తున్నాయి.

సభ వాయిదా పడిన అనంతరం రాజకీయ పరిణామాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఒకవైపు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్సభ స్పీకర్ను కలవగా, మరోవైపు హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమావేశమయ్యారు. ఈ భేటీలు ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ చర్చలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.
ఇక CJPతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఈసారి జేపీ నడ్డా స్వయంగా జంతర్ మంతర్కు వచ్చి చర్చలు జరపాలని CJP డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
అయితే ఈ భేటీలపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. ఢిల్లీలో చోటుచేసుకుంటున్న ఈ వరుస రాజకీయ పరిణామాలు పార్లమెంట్ సమావేశాలపై, అలాగే NEET అంశంపై ముందున్న చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.





