రిసార్ట్ కి చేరిన కన్నడ రాజకీయం…తలపగలకొట్టుకున్న ఎమ్మెల్యేలు

తమ ఎమ్మెల్యేలను లాక్కుని, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తుందని ప్రచారం జరుగుతుండడంతో కర్ణాటకలో మరోసారి రిసార్ట్స్ రాజకీయాలకు తెరలేచిన విషయం తెలిసిందే. బెంగళూరులోని అత్యంత విలాసవంతమయిన ఈగిల్టన్ రిసార్టు కు తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తరలించింది. ఈ నేపథ్యంలో, రిసార్టులో కొందరు ఎమ్మెల్యేల మధ్య నిన్న ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ మీద మరో ఎమ్మెల్యే దాడిచేయడంతో ఆయన గాయపడినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆనంద్ సింగ్‌ తలపై ఎమ్మెల్యే జేఎన్‌ గణేశ్ బాటిల్‌తో కొట్టడంతో ఆయన గాయపడ్డారని, దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు ఆ మీడియా తెలిపింది. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్‌ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజంలేదని వ్యాఖ్యానించినా ఆయన చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి ఈ ఉదయం కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు.రిసార్ట్ కి చేరిన కన్నడ రాజకీయం...తలపగలకొట్టుకున్న ఎమ్మెల్యేలు - Telugu Bullet

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రఘునాథ్ మీడియాతో మాట్లాడుతూ, తాము లోపలకు వెళ్లేందుకు అనుమతించడం లేదని చెప్పారు. అయితే మరోవైపు, ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగిందనే వార్తల్లో నిజం లేదని డీకే శివకుమార్ తెలిపారు. ఇంకోవైపు కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో ఇంతకన్నా రుజువు మరేం కావాలని వారు ప్రశ్నించారు. ఈగిల్టన్ ఘర్షణలో ఒక ఎమ్మెల్యే ఆసుపత్రిపాలయ్యారని అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై కాంగ్రెస్ ఎంత కాలం ఆరోపణలు చేస్తుందని అన్నారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా, కలసిమెలసి ఉన్నారని చెప్పారు. ఈగిల్టన్ రిసార్టుకు 76 మంది ఎమ్మెల్యేలను శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీ తరలించింది. అయితే, ఆయన సోదరుడు, కాంగ్రెస్ నేత డీకే సురేశ్‌ మాత్రం అదే ఆస్పత్రి వద్ద ఉన్నారు. ఆనంద్ సింగ్‌కు చాతీలో నొప్పి రావడంతో హాస్పిటల్‌లో చేర్పించారని తెలిపారు. ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు.