రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్ట దావా

రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్ట దావా

డ్రగ్స్‌ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణలో డ్రగ్స్‌పై అధికార, ప్రతిపక్షాల సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అయితే తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా నిన్న సోమవారం పరువునష్టం దావా వేయగా వివరాలు సక్రమంగా లేవని చెప్పడంతో మంగళవారం మరోసారి మంత్రి కేటీఆర్‌ దావా వేశారు.

సిటీ సివిల్ కోర్టులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్ట దావా పిటిషన్ వేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సిటీ సివిల్ కోర్ట్ మూడో అదనపు సీనియర్ న్యాయమూర్తి ఆ పిటిషన్‌పై విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్‌ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసు, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. అక్టోబర్‌ 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది.