కొండ చరియలు విరిగి వైద్యురాలు మృతి

కొండ చరియలు విరిగి వైద్యురాలు మృతి

హిమాచల్‌ప్రదశ్‌లోని కిన్నౌర్ జిల్లా సంగ్లా-చిత్ కుల్ రోడ్డు వద్ద ఆదివారం కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో 9 మంది మరణించిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. మృతుల్లో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దీపా శర్మ(34) అనే వైద్యురాలు కూడా ఉన్నారు. దుర్ఘటన జరగడానికి సరిగ్గా 25 నిమిషాల ముందు ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. ‘‘సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న భారతదేశపు చిట్టచివరి పాయింట్ వద్ద నేనిప్పుడు నిల్చొని ఉన్నా.

ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో చైనా అక్రమించిన టిబెట్‌తో మనకు సరిహద్దు ఉంది’ అంటూ ట్వీట్ చేశారు దీపా శర్మ’. అయితే అదే ఆమె చివరి ట్వీట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అంతకుముందు రోజు కొండ ప్రాంతంలో దిగిన ఫోటోను షేర్ చేసిన దీపా శర్మ ‘ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు’ అని కామెంట్ పెట్టారు.ప్రకృతి ప్రేమికురాలై దీపా శర్మ తరుచూ అందమై ప్రదేశాలు సందర్శింటారు. దీనికి సంబంధించి తాను దిగిన ఫోటోలు, తన భావాలను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటారు.

ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటనకు సంబంధించిన ప్రతి దృశ్యాన్ని ట్వీట్ చేస్తూ వస్తున్నారు. అలా మధ్యాహ్నం 12.59కు నాగస్థి ఐటీబీపీ చెక్ పోస్టు వద్ద దిగిన చిత్రాన్ని ఆమె పోస్టు చేశారు. సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న చివరి ప్రదేశం ఇదేనంటూ రాసుకొచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.25 గంటలకు ఆమె ప్రయాణిస్తోన్న వాహనంపై కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. వైద్యురాలైన దీపా శర్మకు ఫొటోగ్రఫీ, ట్రావెలింగ్‌, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం చాలా ఇష్టమైన అంశాలు. దీంతో పాటు మహిళా సాధికారత కోసం ఓ ఎన్జీఓతో కలిసి ఆమె పనిచేస్తున్నారు.