పిడుగుపాటుతో తమిళనాడులో ఐదుగురు, ఆంధ్రాలో ఒకరు మృతి

తమిళనాడులో గతరాత్రి భారీస్థాయిలో వర్ష కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడటంతో కొత్తగా పెళ్లైన యువకుడితో పాటు మరో నలుగురు మృతి చెందారు. తెల్లవారుజామన కురిసిన వర్షంలో పిడుగు పాటుకు గురై వాకింగ్‌కు వెళ్లిన నవ వరుడితో పాటు మరో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈశాన్య విదర్భ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు.. పక్కనే ఉన్న తమిళనాడులో కూడా భారీస్థాయిలో వానలు కురుస్తున్నాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఆ రాష్ట్రంలో పిడుగుపాటుకు ప్లస్ వన్ విద్యార్థినితో పాటు ఐదుగురు మృతి చెందారు. తెల్లవారుజామున ఆరంభమైన భారీ వర్షం ఉదయం 8 గంటల వరకు కురిసింది. కాంచీపురంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన నవ వరుడు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

అదేవిధంగా తిరువళ్లూర్‌ జిల్లా నేమలూరులో రైతు చంద్రన్‌, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు నదిలో చేపలు పడుతు న్న ఆనందన్‌, రాణిపేట జిల్లాలో పొలానికి వెళుతున్న ప్లస్‌ వన్‌ విద్యార్థిని మహాలక్ష్మిలు పిడుగుపాటుతో మృత్యవాత పడ్డారు. ఇంకా నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూరులో పెరుమాళ్‌ అనే వ్యక్తిపై కొబ్బరి చెట్లు విరిగి పడిన ఘటనలో అతడు అక్కడే మృతిచెందాడు. కాగా ఆదివారం ఏపీలో కూడా పిడుగుపాటుతో ఒకరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ల చిన్నారి పిడుగు పడి ప్రాణాలు విడిచింది. ఏపీకి కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వివరించింది. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వివరించారు.