కారులో నిప్పంటించుకున్న ప్రేమజంట

కారులో నిప్పంటించుకున్న ప్రేమజంట

అతడొక డ్రైవర్.. ఆమె నర్స్‌గా పనిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఏర్పడిన పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా బంధం బలపడటంతో వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. అయితే చాలా కథల మాదిరిగానే వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పారు. దీంతో కలిసి జీవించే పరిస్థితి లేనప్పుడు కలిసి చనిపోవడమే మంచిదనుకుని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కారెక్కి డోర్స్ లాక్ చేసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లా కినకహళ్లిలో చోటుచేసుకుంది.మాంబళ్లికి చెందిన కాంచన (20), శ్రీనివాస్‌ (26) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లి చేయాలని కోరారు. అయితే అందుకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని చెరువు వద్దకు చేరుకున్న ఈ జంట కొంతసేపు మాట్లాడుకున్నారు. అనంతరం కారు లోపలికి వెళ్లి నిప్పంటించుకున్నారు. ఈ ఘటన చూసి షాకైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు అక్కడికి చేరుకునే సరికే కారు పూర్తిగా దగ్ధమైంది. కాంచన, శ్రీనివాస్ గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదయ్యాయి.చామరాజనగర్ ఎస్పీ దివ్య సారా థామస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనపై మాంబళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం వల్లే వీరిద్దరు అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇరు కుటుంబాల వారిని విచారించిన తర్వాతే కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.