పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తుందా

పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తుందా

సాధారణంగా మహిళలకు పీరియడ్స్ వచ్చిన సమయంలో రక్తస్రావం అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ రక్తస్రావం 50 నుంచి 200 మిల్లీ లీటర్ల వరకు ఉంటుంది. గర్భాశయం లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర ప్రతి నెలా బాగా ఎదిగి, మందంగా తయారై, అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు సంసిద్ధంగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావలసిన రక్తసరఫరాను, పోషకాలను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుని ఎదగడానికి తోడ్పడుతుంది.

గర్భధారణ జరగని పరిస్థితులలో ఈ ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా బయటకు విసర్జించబడుతుంది. దాంతోపాటు కొంత వ్యర్థ కణజాలాలు, అందులో ఉండే రక్తనాళాల కొనలు కూడా గర్భాశయ ద్వారం ద్వారా బయటకు విసర్జించబడతాయి. ఇదంతా హార్మోన్ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ముఖ్యమైనవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్. నెల మొదటి భాగం ఈస్ట్రోజన్ అధీనంలో.. రెండో భాగం అంటే 14 నుంచి 28 రోజుల వరకు ప్రొజెస్టిరోన్ అధీనంలో ఉంటుంది. పీరియడ్స్ సమయంలో సాధారణంగా ఇది రక్తస్రావంతో కానీ.. రక్తస్రావానికి కొద్ది గంటల ముందు నుంచి కానీ మొదలై ఒకట్రెండు రోజులు ఉంటుంది. కొద్దిమందిలో రక్తస్రావం మొదలు కావడానికి ఒకట్రెండు రోజుల ముందు నుంచే నొప్పి వస్తుంది.

దీనికి కారణం గర్భాశయ లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్ విచ్ఛిన్నమై బయటకు వచ్చేటపుడు ఆ కణజాలం నుంచి విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ F2 ఆల్ఫా అనే పదార్థం. దీని వల్ల గర్భాశయంలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి. అప్పుడు గర్భాశయ కండరాలు ముడుచుకోవడం వల్ల రక్త సరఫరా తగ్గుతుంది. దాంతో గర్భాశయ కండరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. ఫలితం కడుపు నొప్పి. గర్భాశయ ద్వారం చిన్నదిగా, సన్నగా ఉంటే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 70 నుంచి 80 శాతం మహిళల్లో పీరియడ్స్ పెయిన్స్ వస్తాయని వైద్యులు చెప్తున్నారు. అయితే పలువురు మహిళల్లో నొప్పి మరియు లక్షణాలు భిన్నంగా ఉంటాయి.

పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం మంచిది కాదని మహిళలు అభిప్రాయపడుతుంటారని, వాస్తవానికి పీరియడ్స్ నొప్పి అనేది శరీరంలోని అంతర్లీన సమస్యను సూచించదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పీరియడ్ సమయంలో తేలికపాటి నుంచి మితమైన నొప్పి మంచి సంకేతమని వారు తెలిపారు. పీరియడ్ నొప్పి ఆరోగ్యకరమైన గర్భాశయం, అండాశయాలకు సంకేతం అని వారు పేర్కొన్నారు. మహిళలు పీరియడ్స్ సమయంలో పులుపుగా ఉండే ఆహారంతో పాటు చల్లని ఆహారాలు తీసుకోకూడదని పలువురు అపోహ పడుతుంటారని, కానీ ఇందులో నిజం లేదన్నారు.

పీరియడ్స్ సమయంలో పుల్లటి ఆహార పదార్థాలను ఎందుకు తీసుకోకూడదు అనే విషయం వెనుక శాస్త్రీయ కారణమేమీ లేదని వైద్యులు చెప్తున్నారు. పుల్లని ఆహారాలలో విటమిన్ సి ఉంటుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని వెల్లడించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు చల్లని ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు కానీ అది మితంగా ఉండాలని సూచించారు. ఆయిల్ మరియు స్పైసీ ఆహారాలకు పీరియడ్స్ వచ్చిన మహిళలు దూరంగా ఉంటే మంచిదని, ఎందుకంటే అవి గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమవుతాయని తెలిపారు. మరోవైపు మహిళలు పీరియడ్స్ సమయంలో గర్భం పొందలేరనే విషయం కేవలం అపోహేనని తేల్చి చెప్పారు.

పీరియడ్స్ సమయంలోనూ మహిళలు గర్భం దాల్చే అవకాశం ఉంటుందన్నారు. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. గర్భం దాల్చడానికి మహిళల్లో అండోత్పత్తి జరగాల్సి ఉంటుందని, ఇది సాధారణంగా పీరియడ్స్ ముగిసిన తర్వాతే జరుగుతుందన్నారు. మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రానిపక్షంలో ఫలదీకరణతో ఉన్న సమయం పీరియడ్స్ కాలంలో అతిగా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువల్ల సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం అయితే పీరియడ్స్ సమయంలో కూడా గర్భం పొందవచ్చన్నారు. మహిళలు గర్భనిరోధక మాత్రలు లేదా IUD తీసుకుంటే తప్ప రక్షణ లేకుండా శృంగారం చేయరాదని సూచించారు.

మరోవైపు మహిళలు పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయకూడదని చాలా మంది చెప్తుంటారని, ఇది కూడా నిజం కాదని వైద్యులు వెల్లడించారు. పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయడం వల్ల నొప్పి పెరుగుతుందని అపోహ పడుతుంటారని… కాని దీనికి విరుద్ధంగా, కొన్ని సాధారణ వ్యాయామాలు, యోగా ఆసనాలు పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయన్నారు. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు పీరియడ్స్ సమయంలోనూ వాటిని కొనసాగించాలన్నారు.

అయితే కఠినమైన వ్యాయామాల కంటే తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవాలని సూచించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నొప్పిని పెంచుతుందనే విషయం కూడా అపోహేనని వైద్యులు అన్నారు. వేడి నీటి స్నానం మహిళల శరీరానికి విశ్రాంతి ఇవ్వడంతో పాటు ఉపశమన ప్రభావాన్ని మాత్రమే కలిగిస్తుందన్నారు. కానీ చల్లటి నీటి స్నానాలు ఎటువంటి హాని కలిగించవని తెలిపారు. పీరియడ్స్ సమయంలో మహిళలు స్విమ్మింగ్ చేయకూడదని కొందరు అపోహ పడుతుంటారని, కానీ పీరియడ్స్ సమయంలో ఈత కొట్టడం పూర్తిగా సురక్షితమని వైద్యులు వెల్లడించారు.