పోలీసులపై వలస కూలీల అటాక్.. రాళ్లతో దాడి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వలస కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమను సొంతూర్లకు పంపాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. కార్మికుల ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వాళ్లపై వలస కూలీలు రాళ్లు రువ్వారు. పోలీసులకు చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు.

అయితే కార్మికుల రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌ జోన్‌-1 డీసీపీ పర్విన్‌ మాల్‌ మాట్లాడుతూ.. వస్ర్తాపూర్‌లో ఆందోళనను నియంత్రిస్తున్న క్రమంలో పోలీసులపై కార్మికులు రాళ్ల దాడి చేశారని తెలిపారు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి చెందిన కార్యాలయాన్ని కూడా కార్మికులు ధ్వంసం చేశారని స్పష్టం చేశారు. సుమారు 250 మంది కార్మికులు పోలీసులను రౌండప్‌ చేశారని.. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ పర్విన్‌ వెల్లడించారు