అలిగిన మంత్రి గంటా…అందుకే క్యాబినెట్ భేటీకి డుమ్మా!

Minister Ganta Srinivasa Rao Absence for Cabinet Meeting on Tuesday

నిన్న రాత్రి జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సర్వే పేరుతో తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నాలు చేసారని ఆయన మనస్తాపం చెందారని ఘంటా వర్గం చెబుతోంది. ఆయన కోసం మిగతా మంత్రులు ఫోన్ ద్వారా సంప్రదించినా అందుబాటులోకి రాలేదు. తాజాగా ఒక పత్రిక సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గంటా ఓడిపోతారని, సొంత నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత ఉందనే ప్రచారం చేస్తున్నారని, దీనికి పార్టీయే కారణమని ఆయన భావిస్తున్నారని. పార్టీలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఘంటా తన సన్నిహితుల దగ్గర వాపోయారని తెలుస్తోంది. రెండేళ్లుగా తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని, వాటిని అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని గంటా తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా సమాచారం.

అలాగే విశాఖలో భూముల కుంభకోణానికి పాల్పడినట్టు, ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్టు వస్తున్న ఆరోపణల వెనక పార్టీకి చెందిన కొందరి హస్తం ఉందని అలాగే హైకోర్టులో పిల్ వేయడంలోనూ వారి పాత్ర ఉందని గంటా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా తనపై ఆరోపణలు ఆగడం లేదనే మనస్తాపంలో ఉన్నారు. గంటాపై వచ్చిన భూముల కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేసిన ‘సిట్’ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ కుంభకోణంలో తన పాత్ర లేదని సిట్ తేల్చిందని, అయితే, ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టకుండా తనను కావాలనే ఇబ్బందులకి గురి చేస్తోందని . దీంతో కేబినెట్ భేటీకి హాజరు కాకుండా నిరసన తెలిపినట్టుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గ భేటీకి హాజరు కాకపోవడంపై గంటా గానీ తెలుగుదేశం పార్టీ గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే పార్టీ అనుకూల సర్వేలో కూడా గంటా ఓడిపోతారని పేర్కొనడంతో ఆయన అసంతృప్తికి లోనైనట్టుగా రాజకీయ వర్గాల్లోనూ, మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది.