మిథాలీ రాజ్‌ ఓ పెను సంచలనం

మిథాలీ రాజ్‌ ఓ పెను సంచలనం

భారత మహిళా క్రికెట్‌లో మిథాలీ రాజ్‌ ఓ పెను సంచలనం. 1999లో ఉమెన్స్‌ క్రికెట్‌లోకి ప్రవేశించిన మిథాలీ రాజ్‌ ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించింది. ఐర్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 114 పరుగులు సాధించి అప్పటివరకు భారతదేశంలో క్రికెట్‌ అంటే పురుషులు మాత్రమే ఆడగలరు అని కామెంట్లు చేసిన వారికి గట్టి సమాధానం చెప్పింది. ఈ ప్రదర్శన తీసివేసేది కాదని కొద్ది రోజుల్లోనే తెలిసేలా చేసింది.

2002లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్‌ తరపున మొదటి డబుల్‌ సెంచరీ చేయడంతో పాటు.. 214 పరుగులు అత్యధిక స్కోరు నమోదు చేసి మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. అప్పటివరకు మహిళల క్రికెట్‌లో కారెన్‌ రోల్టన్‌ పేరిట ఉన్న 209 పరుగులే అత్యధిక స్కోరుగా ఉండేది. మిథాలీ కేవలం మూడో టెస్టులోనే అత్యధిక పరుగుల రికార్డును తుడిచేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

ఆ తర్వాత అనతికాలంలోనే మహిళల ఉమెన్స్‌ క్రికెట్‌లో టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా రికార్డులకెక్కింది. వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌వుమెన్‌గా ధీర్ఘకాలికంగా కొనసాగిన మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారు. అంతేకాదు.. భారత పురుషుల క్రికెట్‌లో క్రికెట్‌ గాడ్‌గా పిలవబడే సచిన్‌ టెండూల్కర్‌ స్థాయిలోనే.. మహిళల క్రికెట్‌లో మిథాలీ లేడీ టెండూల్కర్‌గా కితాబులందుకుంది.

అలాంటి మిథాలీ రాజ్ ఇవాళ(డిసెంబర్‌ 3) 38 పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఐసీసీ మిథాలీ రాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్‌ వీడియోనూ రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా మిథాలీకి బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ఆమె సాధించిన విజయాలు, పలు రికార్డులతో పాటు కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.