అఖిల్ రోమాన్స్ ఎక్కువ చేశాడా…?

Mr Majnu Censored With UA And No Cuts

అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడవ సినిమాగా తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషించి థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు నాలుగు రోజుల ముందు నిన్న ఈ చిత్రం సెన్సార్‌ను పూర్తిచేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ బో     ర్డు సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్లే సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా చాలా బాగుందని, అఖిల్ చాలా బాగా నటించారని, చాలా అందంగా ఉన్నారని సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించారట. అయితే సినిమాకు సెకండాఫ్ ప్రధాన బలమని టాక్.

సినిమా ఆఖరి 45 నిమిషాలు చాలా ఆసక్తికరంగా సాగుతుందట. ఇక ఆఖరి 15 నిమిషాలు అయితే ప్రేక్షకుడిని విశేషంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ 15 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు ప్రాణమని చెబుతున్నారు. కుటుంబ బంధాలు, వారి మధ్య ప్రేమలను తెలియజెప్పే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయట. వెంకీ అట్లూరి మరోసారి తన సున్నితమైన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారని అంటున్నారు. ఇటీవల విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే ఈ ట్రైలర్‌ను ఐదు మిలియన్లకు పైగా సార్లు చూశారు. థమన్ అందించిన పాటలు కూడా బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘F2’ ఒక్కటే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో 25న వచ్చే ‘మిస్టర్ మజ్ను’కు పెద్దగా పోటీ కూడా లేదు. మరి అఖిల్ ఏమి మాయ చేస్తాడో చూడాలి మరి.