శనివారం రాత్రి నుండి రిసార్టు దాటి బయటకు రాని పవన్ కల్యాణ్ ! శ్రేణుల్లో గందరగోళం

pawan-kalyan-stays-at-araku-resort

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రజా పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పర్యటనలను ముగించుకుని శనివారం రాత్రి అరకులోయ చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆరోజు రాత్రి నుంచి అరకులోని ఓ రిసార్టుకే పూర్తిగా పరిమితమయ్యారని సమాచారం. శనివారం సాయంత్రం పద్మాపురం గార్డెన్స్‌ దగ్గరున్న ఒక ప్రైవేటు రిసార్ట్ లో బసచేసిన ఆయన, ఆదివారమంతా అక్కడే గడిపారు. కాసేపు రిసార్ట్ ఆవరణలోనే వాకింగ్ చేశారు. ఆపై తన గదిలోకి వెళ్లిపోయిన ఆయన ఇక బయటకు రాలేదని సమాచారం. తనను కలవడానికి పాడేరు ప్రాంతానికి చెందిన జనసేన కార్యకర్తలు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో పాటు పలువురు ప్రయత్నించినప్పటికీ, పవన్ అందుబాటులోకి రాలేదు. అయితే నవనిర్మాణ దీక్షల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్‌ కోటలో సీఎం చంద్రబాబునాయుడు పర్యతిస్తున్నందున పవన్‌ కల్యాణ్ తన టూర్‌ షెడ్యూల్‌ ను మార్చుకున్నారని జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం. అయితే ఈ విషయం మీద ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు. గత కొద్దిరోజులుగా పవన్ ప్రతి రోజు పర్యటన వివరాలని ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చిన శతగ్ని టీం కూడా ఈ విషయాలని అప్డేట్ చేయకపోవడంతో పవన్ పర్యటన విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.