“కేసీఆర్ జయహో” అంటున్న ప్రజలు

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై కొద్దికాలంగా వ్యతిరేకత పెరుగుతూ వస్తోందన్నది కాదనలేని మాట.దిశపై అత్యాచారం జరిగిన పది రోజుల తరువాత నిందితులను ఈ రోజు పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే నిందితులను ఎన్‌కౌంటర్ చేశారంటూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే కేసీఆర్ కూడా ప్రజలు కోరుకున్న న్యాయం అందించారంటూ ఆయన్ను కీర్తిస్తున్నారు.

సోషల్ మీడియాలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఎన్ కౌంటర్ ఏ పరిస్థితుల్లో, ఎలా జరిగినా, కేసీఆర్ నుంచి అందిన ఆదేశాల మేరకే నిందితులను పోలీసులు మట్టుబెట్టారని, తద్వారా ఓ స్పష్టమైన సంకేతాన్ని రేపిస్టులకు పంపించారని కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ ను పొగుడుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కేసీఆర్ వంటి నేత, సజ్జన్నార్ వంటి పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలని నెటిజన్లు అంటున్నారు. “కేసీఆర్ జయహో” అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.