మాహిళా కానిస్టేబుల్ ని చంపిన కానిస్టేబుల్….వేరే వ్యక్తితో సన్నిహితంగా ?

sultanpur narayana murder

పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ఓ మహిళా కానిస్టేబుల్ ప్రియుడి చేతిలో దారుణహత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు కూడా కానిస్టేబుల్ కావడం కలకలం రేపుతోంది. బాధితురాలి తండ్రి సదానందం తెలిపిన వివరాల ప్రకారం కంది మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్‌ ప్రకాశ్‌, సదాశివపేట మండలం మేకవనంపల్లి గ్రామానికి చెందిన మందారిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సంగారెడ్డి పోలీస్‌‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రకాశ్ హత్నూర పోలీస్‌‌స్టేషన్‌కి, మందారిక రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌కి బదిలీ అయ్యారు. విధుల్లో భాగంగా దూరమైనా వీరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం విధులు ముగించుకుని ప్రకాశ్, మందారిక ఓ చోట కలుసుకున్నారు. రాత్రయినా మందారిక ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి ప్రకాశ్‌ను విచారించగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మందారికను సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామ శివారులో హత్యచేసి పెట్రోలు పోసి తగలబెట్టినట్టు ప్రకాశ్ చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మందారిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మందారిక వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో సహించలేకే ఆమెను హత్య చేసినట్లు ప్రకాశ్ చెబుతున్నాడు. మరోవైపు తనను పెళ్లి చేసుకోవాలని మందారిక ఒత్తిడి తేవడంతోనే ప్రకాశ్ ఆమె ప్రాణాలు తీశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రకాశ్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మహిళా కానిస్టేబుల్‌ని తోటి కానిస్టేబులే హత్య చేయడంతో పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.