భార్యని కొడుకుని చంపి…డ్రమ్ లో వేసి

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. వనస్థలిపురం ఆటోనగర్‌లో భార్య, కుమారుడ్ని దారుణంగా హత్యచేసి డ్రమ్ములో పడేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. బీహార్‌కు చెందిన ఆదిబ్‌ కు జనగామ జిల్లా మన్సూరాబాద్‌కు చెందిన కవితతో పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మారడంతో నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఆటో నగర్‌ లోని విజయ శ్రీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శనివారం ఆదిబ్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన వచ్చింది. ఇంట్లో నుంచి వాసన వస్తుండటంతో యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తాళం పగులగొట్టి ఇంటిని పరిశీలించారు. ఇంట్లో నీటి డ్రమ్ములో ఆదిబ్‌ భార్య కవిత, రెండేళ్ల కుమారుడు ఇమ్రాన్‌ల మృతదేహాలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన ఆదిబ్‌ నాగపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆదిబ్‌ కోసం రెండు పోలీసులు బృందాలను రంగంలోకి దించారు.

భార్యని కొడుకుని చంపి...డ్రమ్ లో వేసి - Telugu Bullet