మందు కొట్టలేదు…అలా మార్ఫింగ్ చేశారు అంతే !

మద్యం తాగి తూలుతూ మాట్లాడానని తన మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణం రాజు ఆరోపించారు. ఈ మేరకు భీమవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు నరసాపురం పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వేణుగోపాల్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రఘురాం కృష్ణంరాజు తరపున ఆయన న్యాయవాది సత్యనారాయణ ఫిర్యాదు లేఖ అందజేశారు. భీమవరంలో శుక్రవారం జరిగిన సినీ అభిమానుల సంఘాల సమావేశంలో రఘురాం కృష్ణం రాజు మద్యం తాగి మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అయన తన ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేశారని, స్లో మోషన్‌లో చూపిస్తూ తనపై ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారని రఘురాం కృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న లింక్‌ల వివరాలను పోలీసులకు అందజేశారు.